రాజమండ్రి నుంచి విహాంగ వీక్షణం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రాజమండ్రి నుంచి విహాంగ వీక్షణం

రాజమండ్రి, జూలై 13 (way2newstv.com)
ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా విహంగ వీక్షణ పర్యాటక ప్రాజెక్టు మొదలైంది. తమిళనాడుకు చెందిన కూనాల్ ఎయిర్ చార్టర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సెస్నా ఎయిర్‌క్రాఫ్ట్‌తో పర్యాటక ప్యాకేజీ సర్వీసును ప్రవేశపెట్టింది. కూనాల్ సంస్థ ఆరేళ్ల క్రితం విహంగ వీక్షణ ఎయిర్‌క్రాఫ్ట్ సర్వీసులను ప్రారంభించింది. ఇప్పటివరకు కర్ణాటక, తమిళనాడులో ఈ ప్రాజెక్టులు నిర్వహిస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యాటక ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో రాష్ట్రంలో సర్వీసుల ప్రారంభానికి కూనాల్ సంస్థ ఆసక్తి కనపర్చింది. దేశవ్యాప్తంగా ఈ విహంగ వీక్షణ పర్యాటకానికి ప్రస్తుతం ఏడు రాష్ట్రాల్లో డిమాండు ఉన్నప్పటికీ కూనాల్ సంస్థ అత్యంత సుందరమైన ప్రాంతంగా ఎంచుకుని, ఏపీలో మొదటి ప్రాజెక్టుగా రాజమహేంద్రవరంలో చేపట్టింది.
రాజమండ్రి నుంచి  విహాంగ వీక్షణం

పర్యాటక ఎయిర్‌క్రాఫ్ట్‌ల్లో విశేషమైన అనుభవం కలిగిన షెర్రీ అనే పైలెట్‌ను కూనాల్ సంస్థ ఇక్కడ నియమించింది. ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌లో 360 డిగ్రీల కోణంలో పర్యాటక ప్రాంతాలను విహంగ వీక్షణం చేయవచ్చు. పైలెట్‌తో పాటు ఇద్దరు ప్రయాణికులతో ఈ ఎయిర్ క్రాఫ్ట్ గద్ద తరహాలో విహంగ వీక్షణం చేసే అరుదైన పర్యాటకం ఇది. ఒకే ఇంజిన్ కలిగిన ఈ విమానంలో ప్రయాణించేటపుడు ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే ఎక్కడబడితే అక్కడ ల్యాండింగ్ చేసే వీలుంది. ఇంజిన్ ఫెయిలైన తర్వాత 10 కిలోమీటర్ల వరకు గాలిపటం మాదిరిగా ఎగురుతూ ఇసుక దిబ్బల్లో గానీ, రోడ్లపైన గానీ సురక్షితంగా ల్యాండింగ్ చేసే టెక్నాలజీ కలిగిన ప్రత్యేక విమానం ఇది. అత్యవసరంగా ల్యాండింగ్ చేయాలనుకున్నా అనువైన ప్రాంతాన్ని చూసి సురక్షితంగా చేయవచ్చు. అరగంట, గంట, గంటన్నర అనే మూడు ప్యాకేజీలుగా ఈ సర్వీసులను ప్రారంభించారు. అరగంట ప్యాకేజీలో ఇద్దరికి రూ.18వేలు, గంటకు రూ.30 వేలు, గంటన్నర ప్యాకేజీలో రూ.48 వేలు టిక్కెటు ధరగా నిర్ణయించారు. గోదావరి నది, ధవళేశ్వరం బ్యారేజి, పుష్కర ఘాట్, కడియం నర్సరీలు, యానాం, కోరింగ మడ అడవులు, హోప్ ఐలాండ్, అంతర్వేది, పోలవరం ప్రాజెక్టు తదితర ప్రాంతాలను వీక్షించే విధంగా ఈ సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు.దీంతోపాటు ప్రత్యేక కార్పొరేట్ ఆఫర్లుగా విశాఖ, విజయవాడ, హైదరాబాద్, తిరుపతికి రోజువారీ ట్రిప్‌లు నిర్వహిస్తున్నారు. ఉదయం తొమ్మిదిన్నర నుంచి సాయంత్రం ఐదున్నర వరకు ఈ ప్యాకేజీలు నిర్వహించనున్నారు. తక్కువ ధరకు విహంగ వీక్షణ పర్యాటకంలో ఎన్నో సుందరమైన ప్రాంతాలను పక్షి మాదిరి ఎగురుతూ వీక్షించడం ఒక మధురానుభూతిగా ఈ ప్రాజెక్టును చేపట్టినట్టు అధికారులు తెలియజేశారు. ఎయిర్‌పోర్టు అధారిటీ ఆఫ్ ఇండియా సహకారంతో ఏపీలో టూరిజాన్ని సరసమైన ధరల్లో అందిస్తున్నట్టు తెలిపారు