వే 2 న్యూస్ టీవీ పాఠకులకు మరియు శ్రేయాభిలాషులకు శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ....!!!!! - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

వే 2 న్యూస్ టీవీ పాఠకులకు మరియు శ్రేయాభిలాషులకు శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ....!!!!!

హైదరాబాద్, తెలంగాణ   23,  (way2newstv.com)  
కృష్ణుడి జననం, ఆయన జీవితం అంతా ఓ అద్భుతం. యుగ యుగాలుగా ఆయన తత్వం, ఆయన జీవితం మానవజాతిని విశేషంగా ప్రభావితం చేస్తోంది. ద్వాపరయుగంలో శ్రీమహావిష్ణువు కృష్ణుడిగా అవతారం దాల్చినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని మధుర కృష్ణుడి జన్మస్థలం. పురాణాల ప్రకారం మధురను పాలించే ఉగ్రసేనుడు వృద్ధుడు కావడంతో అత్యాశపరుడైన అతని కుమారుడు కంసుడు తన తండ్రిని కారాగారంలో బంధించి అధికారాన్ని చేజిక్కించుకుంటాడు. కంసుడి తన సోదరి దేవకిని యాదవ రాజైన వసుదేవుడికిచ్చి వివాహం చేశాడు. సోదరి అంటే ఎంతగానే ప్రేమించే కంసుడు.. ఆమెను పెళ్లైన తరువాత అత్తవారింటికి పంపేందుకు స్వయంగా తానే రథం నడుపుతాడు. మార్గమధ్యంలో ఆకాశవాణి భవిష్యత్తు పలుకుతుంది. ‘ఓ కంసా! నీ సోదరిని పెళ్లి తరువాత నువ్వు ఎంతో ఆనందంగా ఆమెను తీసుకువెళ్తున్నావు. 
 శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ....!!!!!

ఆమెకు పుట్టే ఎనిమిదో సంతానం వల్ల నీకు ప్రాణగండం ఉంది. ఇదే నీ అంతం అని పలికింది. దీంతో ఒక్కసారిగా ఉగ్రుడైన కంసుడు... ఓహో, ఆమె ఎనిమిదో బిడ్డ వచ్చి నన్ను చంపుతుందా? నేను ఆమెను ఇప్పుడే చంపేస్తాను. ఆమె తన అష్టమ సంతానానికి ఎలా జన్మనిస్తుందో నేనూ చూస్తాను’ అని హూంకరిస్తాడు. అక్కడే కత్తి తీసి దేవకి తల నరకబోతుంటే వసుదేవుడు కంసుడిని వేడుకుంటాడు. “దయచేసి ఆమె ప్రాణం తీయకు. ఆమె ఎనిమిదో సంతానమే కదా నిన్ను చంపేది. నేను మాకు పుట్టిన పిల్లలనందరినీ నీకు ఇస్తాను. నువ్వు వాళ్లని చంపవచ్చు. కానీ దయచేసి నా భార్యను వదిలిపెట్టు’ అని వసుదేవుడు ఒక ఒప్పందం కుదుర్చుకుంటాడు. కానీ కంసుడు తన ప్రాణం మీద ఉన్న తీపితో చెల్లెలిని, బావను గృహనిర్బంధంలో ఉంచి కొంతమందిని కాపలా ఉంచుతాడు. తొలి సంతానం పుట్టగానే కాపలాదారులు కంసుడికి ఈ వార్తను చేరవేస్తారు. ఆయన రాగానే దేవకీ వసుదేవులు.. ఎనిమిదో సంతానమే కదా నిన్ను చంపేది, ఈ బిడ్డను ప్రాణాలతో వదిలేయమమని ప్రాధేయపడతారు. కంసుడు వారి వేదనను పట్టించుకోకుండా బిడ్డను తీసుకుని కాళ్ళు పట్టుకుని ఒక రాయికేసి బాదుతాడు. ప్రతీ సారీ ఒక శిశువు జన్మించటం, ఆ తల్లిదండ్రులు కంసుడిని ఎంతగా ప్రాధేయపడినా, ఎవరినీ ప్రాణాలతో వదిలేయక హతమార్చాడు. ఉరుములతో కూడిన వర్షం కురుస్తుండగా అష్టమ సంతానానికి దేవకి జన్మనిచ్చింది. అప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది. కారాగారం తలుపులు వాటంతట అవే తెరుచుకుంటాయి. కాపలావాళ్లు అందరూ నిద్రలోకి జారిపోతారు. వసుదేవుడి సంకెళ్లు తెగిపోతాయి. వసుదేవుడు ఇదంతా దైవలీలగా భావిస్తాడు. వెంటనే ఆయన బిడ్డను ఎత్తుకుని, ఎదో మార్గనిర్దేశం జరిగినట్లు యమునా నదివైపుకు నడుస్తాడు. ఆ ప్రదేశమంతా వరదతో మునిగి ఉన్నా ఆశ్చర్యకరంగా ఆయన నదిని దాటే మార్గం తెరుచుకునే ఉంటుంది. వసుదేవుడు నదిని దాటి నంద, యశోదల ఇంటికి వెళ్తాడు. యశోద అప్పుడే ఒక ఆడపిల్లకు జన్మనిస్తుంది. అది ఎంతో కష్టమైన ప్రసవం కావటం వల్ల ఆమె స్పృహలో ఉండదు. వసుదేవుడు ఈ ఆడపిల్ల స్థానంలో కృష్ణుడిని ఉంచి, ఆ ఆడపిల్లను తీసుకుని తిరిగి కారాగారానికి వచ్చేస్తాడు. అప్పుడు ఆ ఆడపిల్ల ఏడుస్తుంది. కాపలావాళ్లు వెళ్లి కంసుడికి వార్త చేరవేస్తారు. కంసుడు అనుమానంతో కాపలావాళ్లను ప్రశ్నించగా వారు భయపడి తామంతా చూశామని ఆడపిల్లే పుట్టిందని చెబుతారు. ఇది కేవలం ఒక ఆడపిల్ల. ఒక ఆడపిల్ల నిన్ను చంపలేదు. అదే ఒక మగపిల్లాడు అయ్యుంటే అతను నిన్ను చంప గలిగేవాడేమో. కాని ఇది ఒక ఆడపిల్ల. ఈ పాపను వదిలిపెట్టు’ అని కంసుడిని దేవకీ వసుదేవులు అర్ధిస్తారు. కానీ కంసుడు కనికరించడు. ఆ బిడ్డ కాళ్లను పైకెత్తి నేలకేసి కొట్టబోతాడు. అప్పుడు ఆ బిడ్డ కంసుడి చేతి నుంచి జారిపోయి ఎగిరి బయటకు వెళ్లి ‘నిన్ను చంపేవాడు మరెక్కడో ఉన్నాడు’ అని చెప్పి మాయమవుతుంది. ఆ విధంగా గోకులం చేరిన కృష్ణుడు, రాజు కొడుకే అయినా ఒక సాధారణమైన గోవుల కాపరిలాగానే పెరిగాడు. శ్రీమహావిష్ణువు ఎనిమిదో అవతారమైన శ్రీకృష్ణుడు జన్మించిన అష్టమినే కృష్ణాష్టమిగా జరుపుకుంటున్నాం.