రాజ్ తరుణ్ అరెస్ట్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రాజ్ తరుణ్ అరెస్ట్

హైద్రాబాద్, ఆగస్టు 23 (way2newstv.com):
కారు యాక్సిడెంట్ కేసులో హీరో రాజ్ తరుణ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వెంటనే స్టేషన్ బెయిల్ ఇచ్చి విడుదల చేశారు. రాజ్ తరుణ్ స్టేట్ మెంట్ ని పోలీసులు రికార్డ్ చేశామని మాదాపూర్ డీసీపీ తెలిపారు. యాక్సిడెంట్ జరిగిన రోజున ఏం జరిగింది అనే వివరాలు సేకరించారు. యాక్సిడెంట్ తర్వాత రాజ్ తరుణ్ అజ్ఞాతంలోకి వెళ్లాడు. దీంతో పోలీసులు 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు. నోటీసులు అందుకున్న రాజ్ తరుణ్.. పోలీసుల ముందు హాజరై స్టేట్ మెంట్ ఇచ్చాడు. స్టేట్ మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు.. రెండు రోజుల్లో కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్నారు. వీడియోతో బ్లాక్ మెయిల్ చేసినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న డిజైనర్ కార్తీక్ పై మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. 
 రాజ్ తరుణ్ అరెస్ట్

కార్తీక్ ని అరెస్ట్ చేసి స్టేట్ మెంట్ రికార్డ్ చేస్తామని మాదాపూర్ పోలీసులు తెలిపారు. కాగా రాజ్ తరుణ్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేశాడని చెప్పడానికి సరైన ఆధారాలు లేవని పోలీసులు అంటున్నారు. ప్రమాదం జరిగిన మరుసటి రోజే టెస్ట్ చేసి ఉంటే నిజం తెలిసేదన్నారు. యాక్సిడెంట్ కేసులో రాజ్ తరుణ్ పై ర్యాష్ డ్రైవింగ్, పబ్లిక్ న్యూసెన్స్(279, 336) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నార్సింగి దగ్గర రాజ్ తరుణ్ కారు యాక్సిడెంట్ కు గురైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ కేసు అనేక మలుపులు తిరిగింది. కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి. రాజ్ తరుణ్ యాక్సిడెంట్ దృశ్యాలను కార్తీక్ అనే డిజైనర్ వీడియో తీశాడు. ఆ వీడియో ద్వారా డబ్బు కోసం తమను బ్లాక్ మెయిల్ చేశాడని కార్తీక్ పై మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో రాజ్ తరుణ్ మేనేజర్ రాజా రవీంద్ర ఫిర్యాదు చేశారు. యాక్సిడెంట్‌ వీడియోలు మీడియాకు ఇస్తానని కార్తీక్‌ బ్లాక్‌ మెయిల్‌కు పాల్పడినట్టు రాజా రవీంద్ర గురువారం పోలీసులతో చెప్పారు. ఆగస్టు 21న కార్తీక్‌ తనకు కాల్‌ చేసి రాజ్‌ తరుణ్‌కు సంబంధించిన వీడియో తన దగ్గర ఉందని, రూ.5 లక్షలు ఇవ్వకుంటే సోషల్‌ మీడియాలో పెడతానని బెదిరించాడని రాజారవీంద్ర అన్నారు.కార్తీక్ మాత్రం మరోలా చెబుతున్నాడు. ఆ వీడియోలు డిలీట్ చెయ్యాలని రాజ్ తరుణ్ పేరుతో కొందరు వ్యక్తులు తనకు ఫోన్ చేసి బెదిరించారని ఆరోపించాడు. డబ్బు కోసం తాను బ్లాక్‌ మెయిల్‌ చేశానని అనడం అవాస్తవం అన్నాడు. ఇరువురి ఫిర్యాదులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆగస్టు 20న నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో రాజ్‌ తరుణ్‌ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. రాజ్‌ తరుణ్‌ కారు దిగి పరిగెడుతుండగా కార్తీక్‌ వీడియో తీసినట్టుగా తెలుస్తోంది. ఆ వీడియోలు మీడియాలో వైరల్‌ అయ్యాయి