ఎమోషనల్ జర్నీగా కౌశల్య కృష్ణమూర్తి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఎమోషనల్ జర్నీగా కౌశల్య కృష్ణమూర్తి

హైద్రాబాద్, ఆగస్టు 23 (way2newstv.com):
అవును.. మెగాస్టార్ చిరంజీవి చెప్పినట్టు ఇండియాలో క్రికెట్‌ అనేది నేషనల్‌ గేమ్‌లాంటిదే. ఒకరకంగా చెప్పాలంటే.. ఇండియాలో క్రికెట్ అనేది ఒక మతం. అందుకే క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే చిత్రాలకు ఆదరణ ఎక్కువే. అప్పట్లో ‘ధోని’.. ఈ మధ్య ‘జెర్సీ’ చిత్రాలు ఇదే బ్యాక్ డ్రాప్‌లో వచ్చి హిట్ కొట్టాయి. అయితే వాళ్లే కాదు.. నేను గ్రౌండ్‌లోకి దిగితే సిక్స్‌ల మోత మోగిస్తా.. బాక్సాఫీస్‌ను ఫిదా చేస్తా అంటూ గ్రౌండ్‌లోకి దిగింది ‘కౌసల్య కృష్ణమూర్తి’. ఐశ్వర్య రాజేష్ లీడ్ రోల్‌లో సీనియర్ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ‘కౌసల్య కృష్ణమూర్తి’ నేడు (ఆగస్టు 23) థియేటర్స్‌లో విడుదలైంది. ‘క్రికెట్‌లో ఇండియా ఓడిపోయిందని మా నాన్న ఏడ్చాడు సార్.. అందుకు నేను ఇండియా తరుపున ఆడి గెలిచి మా నాన్నను సంతోషపెట్టాలి సార్’ అంటూ రెండేళ్ల వయసు నుండి క్రికెటర్ కావాలని కలలు కన్న ఓ సాధారణ రైతు కూతురు తన కలలను ఎలా సాకారం చేసుకుందన్నదే ఈ ‘కౌసల్య కృష్ణమూర్తి’. 
ఎమోషనల్ జర్నీగా కౌశల్య కృష్ణమూర్తి

గవాస్కర్, సచిన్ క్రికెట్‌లోకి కొడుకుల్నే పంపించారు కాని కూతుళ్లను పంపించలేదుగా.. మరి వాళ్లకంటే ఎక్కువా.. ఈ కృష్ణమూర్తి? ‘క్రికెట్ చాలా కష్టమైన ఆట.. సున్నితంగా ఉండే అమ్మాయిలు అస్సలు ఆడలేరు’.. అలాంటి ఆటను అలవోకగా ‘కౌసల్య’ అనే పల్లెటూరి అమ్మాయి ఆడింది. అంతర్జాతీయ స్థాయిలో మేటి క్రికెటర్‌గా నిలిచి ఊరి పేరును తల్లిదండ్రుల ఆశను నిలిపింది. ఈ కథలో ‘కృష్ణమూర్తి’గా నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ నటిస్తే.. ‘కౌసల్య’ పాత్రకు ఐశ్వర్య రాజేష్ జీవం పోశారు. 2018 తమిళ్‌లో విడుదలై సక్సెస్ అయిన ‘కణ’ చిత్రాన్ని తెలుగులో ‘కౌసల్య కృష్ణమూర్తి’గా రీమేక్ చేశారు. తమిళ్‌లో కౌసల్య పాత్రను ఐశ్వర్య రాజేష్ చేస్తే.. కృష్ణమూర్తి పాత్రను సత్యరాజ్ చేరారు. తెలుగు నేటివిటీకి అనుగుణంగా రీమేక్ చేయడంతో సిద్దహస్తుడిగా పేరొందిన సీనియర్ దర్శకుడు భీమనేని మరోసారి తన మార్క్ చూపించేందుకు ‘కౌసల్య కృష్ణమూర్తి’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు చిత్ర కథను టీజర్‌, ట్రైలర్‌లోనే చూపించారు. రాజమండ్రి దగ్గర ఇరదవరంలో ఉండే కృష్ణమూర్తికి భార్య, కూతురి పాటు క్రికెట్ అన్నా.. వ్యవసాయం అన్నా ప్రాణం. తండ్రి ఇష్టాన్నే తన ఇష్టంగా మార్చుకుంటుంది కూతురు కౌశల్య (ఐశ్వర్య రాజేష్). రెండేళ్ల వయసు నుంచే క్రికెటర్ కావాలని కలలుకంటుంది. తన కలలను సాకారం చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు పడింది. పల్లెటూరి నుండి వచ్చిన రైతు కూతురు ఇండియన్ టీంకి ఎలా ఆడింది? ఫిమేల్‌ క్రికెటర్‌గా ఎలా విజయం సాధించింది? తండ్రికి, దేశానికి ఎంత పేరు తెచ్చింది అనేది ఈ సినిమాలోని ప్రధాన ఇతివృత్తం. మొదటిగా కౌసల్య పాత్రకు ఐశ్వర్య ఎంపిక ఈ సినిమాకి బిగ్గెస్ట్‌ ప్లస్‌. పల్లెటూరి అమ్మాయిగా డీ గ్లామరస్ పాత్రలో ఒదిగిపోయింది. క్రికెటర్‌ క్యారెక్టర్‌కి జస్టిఫై చేయడానికి నాలుగైదు నెలల పాటు ప్రత్యేక శిక్షణ తీసుకున్న ఐశ్వర్య.. ఆమె పడ్డ శ్రమ, వర్క్ డెడికేషన్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. నటుడు రాజేష్‌ కుమార్తె, హాస్యనటి శ్రీలక్ష్మి మేనకోడలు అయిన ఐశర్యా రాజేష్‌‌కు తెలుగులో మొదటి చిత్రమే అయినప్పటికీ కౌసల్య పాత్రకు పూర్తి న్యాయం చేశారు. తమిళ్‌లో ఇప్పటికే టాలెంటెడ్ హీరోయిన్‌గా పేరుతెచ్చుకున్న ఐశ్వర్య.. ఈ చిత్రంతో తెలుగులో బెంచ్‌మార్క్‌ సెట్‌ చేసుకున్నాడు. మగాళ్లతో కలిసి క్రికెట్ ఆడే సన్నివేశం.. రాజేంద్రప్రసాద్‌తో వచ్చే భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి. కృష్ణమూర్తి పాత్రకు నట కిరీటి రాజేంద్రప్రసాద్ జీవం పోశారు. ఒక కూతురి కలను నిజం చేయడానికి తండ్రి పడే తపన ఆయనలో కనిపిస్తుంది. మరోవైపు దేశానికి అన్నం పెట్టే రైతు దుస్థితిని ఆయన పాత్ర ద్వారా కళ్లకు కట్టారు. ఈ కథలో ‘మగపిల్లలతో కలిసి బ్యాట్ ఆట ఆడతావే.. బ్యాట్ ఆట అంటూ చీపురుతో చితక్కొట్టే తల్లి సావిత్రిగా యాంకర్ ఝాన్సీ అదరగొట్టేసింది. ‘ఏదైనా కావాలంటే ఆశపడితే సరిపోదే.. పట్టుబట్టి సాధించాలి’ అంటూ ఆమె చెప్పే డైలాగ్స్ ఎమోషనల్‌గా పండాయి. ఇక ఈ చిత్రంలో క్రికెట్ కోచ్‌గా నెల్సన్ పాత్రలో తమిళ నటుడు శివకార్తికేయన్ ఆకట్టుకున్నారు. ఆయన ఎంట్రీతో కథ పుంజుకుంటుంది. ‘ఈలోకం గెలుస్తానని చెబితే వినదు. కాని గెలిచిన వాళ్లు చెబితే వింటుంది. నువ్ ఏం చెప్పినా గెలిచి చెప్పు’, ‘నీవల్ల కాదు అంటే నువ్ నమ్మాల్సింది వాళ్లను కాదు.. నిన్ను’ అంటూ ఆయన చెప్పే డైలాగ్స్ స్పూర్తినిస్తాయి. దర్శకుడి కథకు జీవంపోసే నటులు దొరికితే ఆ సినిమా సగం సక్సెస్ అయినట్టే. ఈ విషయంలో భీమనేని మరోసారి తన సీనియారిటీని చూపించారు. తమిళ కథను పెద్దగా మార్పులు చేయకుండానే.. తెలుగు ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలా సన్నివేశాలను చిత్రీకరించారు. ఒరిజినల్ కథను కిచిడీ చేయకుండా అనవరసమైన సన్నివేశాలను ఇరికించకుండా కథను సూటిగా మొదలుపెట్టాడు. అయితే కథ ఏమిటి? తరువాత ఏం జరగబోతుందన్నది ప్రేక్షకుడి ముందే తెలిసిపోతుంది. ప్రేక్షకుడి ఊహలకు దగ్గరగా ట్విస్ట్‌లకు దూరంగా కథను సాఫీగా నడిపాడు. క్రీడా నేపథ్యం ఉన్న కథలకు ఎలాంటి ముగింపు ఉంటుందో ఈ కథ కూడా అలాంటిదే. అయితే క్రీడా నేపథ్యం ఉన్న కథలో రైతు పడే ఇబ్బందుల్ని తెలియజేసి సందేశాత్మకంగా మలచడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. పడిపోతున్న క్రికెట్‌ను కాపాడటానికి తరానికి ఒకరు వస్తుంటారు.. అప్పట్లో సచిన్.. ఇప్పుడు కోహ్లీ.. ఆ తరువాత మరొకరు. కాని వ్యవసాయాన్ని కాపాడటానికి.. క్రిష్ణమూర్తి లాంటి రైతుల్ని ఆదుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. వ్యవసాయంలో రైతు ఓటమి అతని ఒక్కడికే ఓటమి కాదు. మొత్తం దేశానికి అవమానం’ చివర్లో చక్కని సందేశం ఇచ్చారు. ఇక వైజాగ్‌ రాజుగారి అబ్బాయి కార్తీక్‌ రాజు ఈ సినిమాలో హీరోగా కనిపించినప్పటీ.. హీరోయిన్‌తో కాంబినేషన్ సీన్లు కనిపించవు. కథలో లవ్ ట్రాక్‌ను ఇరికించకుండా హీరో ఉన్నాడంటే ఉన్నాడు అన్నట్టుగా ఆయన పాత్ర ఉంది. ఇక ఈ చిత్రంలోని ఇతర నటీనటులు వెన్నెల కిషోర్, రంగస్థలం మహేష్, విష్ణు టాక్సీవాలా హాలీవుడ్, రవిప్రకాష్ పరిధి మేర ఆకట్టుకున్నారు. టెక్నికల్ పరంగా ఈ సినిమా రిచ్‌గా ఉంది. ముఖ్యంగా క్రీడా నేపథ్యం ఉన్న సినిమాలకు సినిమాటోగ్రఫీ చాలా కీలకం. ఈ చిత్రంలో ఆండ్రూ కెమెరా పనితనం బాగుంది. దిబూ నినాన్ థామస్ మ్యూజిక్ చిత్రానికి హెల్ప్ అయ్యింది. నేపథ్యం సంగీతం బాగుంది. ‘కౌశల్య కృష్ణమూర్తి’ కథకు మైనస్ అయినా ప్లస్ అయినా అది కథే. క్రికెట్ నేపథ్యంలో ‘ధోనీ’, ‘జెర్సీ’ కథలు ఇప్పటికే ప్రేక్షకులకు చేరువకావడంతో ఈ కథలో కొత్తదనం అనిపించదు. ఎమోషనల్‌గా వర్కౌట్ అయినప్పటికీ కమర్షియల్‌గా లబ్ధి చేకూరడం అనుమానమే. వన్‌ డైమెన్షనల్‌గా వున్న క్రికెట్ మ్యాచ్ సీన్లు చాలా సుదీర్ఘంగా అనిపిస్తాయి. ఇది క్రికెట్ నేపథ్యం ఉన్న కథ కాబట్టి రిపీట్‌గా క్రికెట్ మ్యాచ్ సీన్లు ఉన్నప్పటికీ క్రికెట్‌ను ఇష్టపడని వాళ్లకు ఈ కథ అంతగా రుచించకపోవచ్చు. ఓవరాల్‌గా.. ‘కౌసల్య కృష్ణమూర్తి’ సిక్స్‌లు, ఫోర్ల‌తో బౌండరీల మోత లేదుకాని.. చక్కని డిఫెన్సింగ్ ఎమోషనల్ జర్నీ.