జ్యోతుల నెహ్రు వారసుడి కోసం త్యాగం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జ్యోతుల నెహ్రు వారసుడి కోసం త్యాగం

కాకినాడ, ఆగస్టు 07, (way2newstv.com)
నాయకుల తలరాతలు ఎలా మారుతాయో చెప్పడం కష్టం. ఒకే ఒక్క నిర్ణయం.. నాయకులను కిందకి పడేయ గలదు… అదే నిర్ణయం.. నాయకులను అమాంతం పైకి ఎత్తనూ గలదు! ఏదేమైనా.. 2017-18 మధ్య కాలంలో ఏపీలో జరిగిన రాజకీయ పరిణామాలు.. నాయకుల తలరాతలను మాత్రం మార్చేశాయి. ముఖ్యంగా వైసీపీ నుంచి హుటాహుటిన జంప్‌ చేసి టీడీపీలోకి చేరిన వారి పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారిపోయింది. అటు టీడీపీలోను, ఇటు వైసీపీలోనూ చాలా మంది నాయకులు ఫ్యూచర్‌ను కోల్పోయారు.ఇక ఎన్నిక‌ల‌కు ముందు ఇత‌ర పార్టీల నుంచి వైసీపీలోకి వెళ్లి గెలిచిన వారి ల‌క్ మామూలుగా లేదు. ఇక మేడా మ‌ల్లిఖార్జున‌రెడ్డి లాంటి వాళ్లు అయితే ఐదేళ్ల పాటు అటు టీడీపీలో ప‌ద‌వులు అనుభ‌వించి… ఇప్పుడు వైసీపీలోకి వ‌చ్చి ఇక్కడా గెలిచి అధికారం అనుభ‌విస్తున్నారు. 
జ్యోతుల  నెహ్రు వారసుడి కోసం త్యాగం

ఇక రాజ‌కీయంగా ఫేడ‌వుట్ అయిన వంగా గీత లాంటి వాళ్లు అనూహ్యంగా ఎంపీల‌య్యారు. ఇక బ్యాడ్ ల‌క్ నాయకుల్లో తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల వెంకట అప్పారావు.. ఉరఫ్‌ జ్యోతుల నెహ్రూ పరిస్థితి మరింత దారుణం.2014 ఎన్నికల్లో ఆయన వైసీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు.అంతేకాదు, వైసీపీ అధినేత జగన్‌కు అత్యంత సన్నిహితుడైన కాపు నాయకుడిగా కూడా ఆయన గుర్తింపు సాధించారు. అంతేకాదు, అసెంబ్లీలో వైసీపీ పక్ష ఉప నాయకుడిగా జగన్‌ ఆయనకు విలువ ఇచ్చారు. అయితే, 2017లో అప్పటి పీఏసీ చైర్మన్‌గా ఉన్న భూమా నాగిరెడ్డి హటాత్తుగా జగన్‌కు బై చెప్పి.. టీడీపీలోకి జంప్‌ చేశారు. దీంతో ఏర్పడిన ఆ ఖాళీని జ్యోతుల నెహ్రూతో పూరించారు. జగన్ కేబినెట్ పదవి ఇచ్చినా జ్యోతుల నెహ్రూ వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి జంప్ అయ్యారు. మంత్రి దక్కుతుందని జ్యోతుల నెహ్రూ ఆశించారు. కుమారుడిని జడ్పీ ఛైర్మన్ చేయడానికే ఆయన పార్టీ మారారన్నది టాక్.అయితే, తర్వాత కాలంలో సమీకరణలు సహకరించని నేపథ్యంలో చంద్రబాబు జ్యోతుల నెహ్రూ ను పక్కన పెట్టి ఆయన కుమారుడుకి జ‌డ్పీచైర్మన్ ప‌దవి ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. ఇక, 2019లో టీడీపీ తరఫున పోటీ చేసిన జ్యోతుల వైసీపీ సునామీ ముందు చేతులు ఎత్తేశారు. ఇప్పుడు ఎటూ ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోయారు. అయితే, జ్యోతుల నెహ్రూ కనుక వైసీపీలోనే ఉండి ఉంటే.. ఆయనకు ఖచ్చితంగా వైసీపీలో కీలక పదవి దక్కి ఉండేదని అంటున్నారు రాజకీయ నిపుణులు. ముఖ్యంగా జగన్‌ తన కేబినెట్‌లో జ్యోతుల నెహ్రూకు మంచి పదవి ఇచ్చి ఉండేవారని చెబుతున్నారు.ప్రస్తుతం తూర్పుగోదావ‌రి జిల్లా నుంచి వైసీపీ త‌ర‌పున ఆరుగురు కాపులు ఎమ్మెల్యేలుగా గెలిచినా వీరంద‌రు జ్యోతుల నెహ్రూ అనుభ‌వంతో పోలిస్తే చిన్నవాళ్లు. నెహ్రూ రాజ‌కీయ చాణుక్యం ముందు వాళ్లు ఆగే ప‌రిస్థితి ఉండ‌దు. జిల్లా కాపుల‌ను ముద్రగ‌డ త‌ర్వాత లీడ్ చేసే లీడ‌ర్ల‌లో జ్యోతుల నెహ్రూ కూడా ఒక‌రు. అయితే కుమారుడి రాజకీయ భవిష్యత్ కెసం జ్యోతుల నెహ్రూ మొత్తానికే తన కెరీర్‌ను నాశనం చేసుకున్నారని అంటున్నారు ఆయన అనుచరులు. నిజమే కదా!!