చిక్కు ముడిగా కాపు రిజర్వేషన్లు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

చిక్కు ముడిగా కాపు రిజర్వేషన్లు

కాకినాడ, ఆగస్టు 12, (way2newstv.com)
రాష్ట్రంలో సుదీర్ఘ రాజకీయ సమస్యగా మారిన కాపుల రిజర్వేషన్‌ విషయం.. ముడి పడడం లేదు. దీనికి సంబంధించి గత చంద్రబాబు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు విమర్శలకు తావిచ్చాయి. ఇక, ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం దీనిపై స్పష్టంగా తన వైఖరిని వెల్లడించడంతో కాపుల్లో కొంత మేరకు ఆందోళన నెలకొన్న మాట నిజం. అయితే, ఈ సమస్యపై రాజకీయ మేధావులు మాత్రం.. గత చంద్రబాబు కన్నా.. ప్రస్తుత జగన్‌ విధానం మెరుగ్గానే ఉందని అంటున్నారు. ఎక్కడా దాపరికం లేకుండా వ్యవహరిస్తున్నారని చెబుతున్నా రు.చంద్రబాబు 2014 ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కాపులకు న్యాయం చేస్తా మని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో టీడీపీకి అనుకూలంగా కాపు సామాజిక వర్గం ఓటెత్తింది. ఫలితంగా పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. అయితే, తర్వాత కాపులు ఉద్యమించే వరకు కూడా బాబు దీనిపై దృష్టి పెట్టలేదు. 
చిక్కు ముడిగా కాపు రిజర్వేషన్లు

దీంతో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో కాపులు ఉద్యమించారు. తునిలో సమావేశం అనంతరం, రైలు దహనం, పోలీసు స్టేషన్‌పై దాడి వంటి ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి.ఈ క్రమంలోనే చంద్రబాబు మాజీ న్యాయమూర్తి మంజునాథతో కమిటీ వేశారు. అయితే, ఈ కమిటీ చైర్మన్‌ పూర్తిగా చర్చించి, నివేదిక సమర్పించేలోగానే చంద్రబాబు కమిటీలో కొందరు సభ్యులు మధ్యంతరంగా ఇచ్చిన నివేదికలను అసెంబ్లీలో ప్రవేశ పెట్టి కాపులకు 5% రిజర్వేషన్ (ఇత‌ర రిజ‌ర్వేష‌న్ల‌ కోటా 50%నికి ఆవల) కల్పిస్తూ తీర్మానం ఒకటి చేసి కేంద్రానికి పంపారు. అయితే, ఇది సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం విరుద్ధం కావడంతో కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం పక్కన పెట్టింది.ఈలోగా.. కేంద్రమే అగ్రవర్ణ పేదలకు రాజకీయాలు, ఉద్యోగాలు వంటి విషయాల్లో 10% రిజర్వేషన్‌ ఇస్తూ.. కీలక బిల్లు పాస్‌ చేసింది. దీనిని తనకు అనుకూలంగా మార్చుకున్న చంద్రబాబు.. దీనిలో 5% కాపులకు కేటాయించారు. ఇదే ఇప్పుడు వివాదంగా మారిందని అంటున్నారు ప్రస్తుత సీఎం జగన్‌. చంద్రబాబు రెండు సార్లు కాపులకు అన్యాయం చేశారనేది ఆయన ఆరోపణ. అసెంబ్లీలో తీర్మానం చేసిన దాని ప్రకారం కాపులకు బీసీలకు ఆవల 5% రిజర్వేషన్‌ ఇవ్వాలా? లేక వారిని అగ్రవర్ణ పేదలుగా గుర్తించి 5% రిజర్వేషన్‌ ఇవ్వాలా? అనేది జగన్‌ ప్రశ్న. ఎలాగూ ఎన్ని కులాలకు రిజర్వేషన్‌ ఇచ్చిన అది 50’% మించరాదనే సుప్రీకోర్టు తీర్పు మేరకు కాపులకు రిజర్వేషన్‌ అందని ఫలంగా మారింది కనుక వారికి అందరితోపాటు అగ్రవర్ణ పేదలుగా గుర్తించి.. వారికి 10% రిజర్వేషన్‌ను అమలు చేస్తామని జగన్‌ చెబుతున్నారు. అదే సమయంలో తాను నవరత్నాల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.2 వేల కోట్లు ఇస్తామని చెబుతున్నారు. అయితే, దీనిని రాజకీయంగా వివాదం చేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తుడడమే ఇప్పుడు కాంట్రవర్సీగా మారుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.