రాష్ట్రపతి కావడానికి టిప్ చెప్పండి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రాష్ట్రపతి కావడానికి టిప్ చెప్పండి

మోడీకి స్టూడెంట్ క్వశ్చన్
బెంగళూర్, సెప్టెంబర్ 7, (way2newstv.com)
చివరి నిమిషంలో సాంకేతిక లోపంతో ల్యాండర్ విక్రమ్‌ నుంచి సంకేతాలు నిలిచిపోవడంతో ఇస్రో శాస్త్రవేత్తలు సహా యావత్తు భారతావని నిరాశలో కూరుకుపోయింది. కాగా, చంద్రయాన్-2 ల్యాండింగ్‌ను ప్రత్యక్షంగా ప్రధానితో కలిసి వీక్షించేందుకు దేశవ్యాప్తంగా 60 మంది విద్యార్థులను ఆన్‌లైన్ ద్వారా ఇస్రో ఎంపికచేసిన విషయం తెలిసిందే. శనివారం అర్ధరాత్రి బెంగళూరులోని ఇస్రో ప్రధాన కేంద్రంలో మోదీతో కలిసి వివిధ రాష్ట్రాలకు చెందిన ఈ 60 విద్యార్థులంతా ల్యాండింగ్ ప్రక్రియను వీక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ప్రధాని మాట్లాడుతుండగా ఓ విద్యార్థి సంధించిన ప్రశ్నకు మోదీ అవాక్కయ్యారు. 
రాష్ట్రపతి కావడానికి టిప్ చెప్పండి

రాష్ట్రపతి కావాలంటే ఏం చేయాలో టిప్స్ చెప్పమని కోరాడు. దీనికి స్పందించిన మోదీ ప్రధాని ఎందుకు కావద్దనుకుంటున్నావని చమత్కరించారు.‘భారత రాష్ట్రపతి కావడమే నా లక్ష్యం... కాబట్టి నేను ఎలాంటి విధానాలు అనుసరించాలి’ అని ప్రశ్నించాడు. దీనికి బదులిచ్చిన మోదీ.. ‘‘రాష్ట్రపతే ఎందుకు కావాలనుకుంటున్నావు? ప్రధాని అయ్యే ఉద్దేశం లేదా? అని ఎదురు ప్రశ్నించారు... విద్యార్థులు తమ జీవితంలో పెద్ద లక్ష్యాన్ని పెట్టుకుని, దానిని చిన్న చిన్న భాగాలుగా విడిగొట్టి దీని ద్వారా గమ్యాన్ని చేరుకోవాలి. లక్ష్యాన్ని చేరే క్రమంలో కోల్పోయిన వాటిని గురించి ఆలోచించరాదని, నిరాశ చెందకూడదని’’ సలహా ఇచ్చారు.ఆ విద్యార్థిని అభినందించిన మోదీ తన ఆటోగ్రాఫ్ సైతం ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గంట వ్యవధిలోనే దీనిని దాదాపు 20 వేల మంది వీక్షించగా, 1,200 లైక్‌లు వచ్చాయి. ఆగస్టు 10 నుంచి 20 వరకు ఆన్‌లైన్‌లో క్విజ్ నిర్వహించిన ఇస్రో.. రాష్ట్రానికి ఇద్దరు విద్యార్థుల వంతున ఎంపికచేసింది. వీరిలో ఇద్దరూ భూటాన్ విద్యార్థులు కూడా ఉండటం విశేషం. నిర్ణీత సమయంలో 20 ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన ప్రతిభావంతులకు మోదీతో చంద్రయాన్-2ను చూసే అవకాశం కల్పించారు.ఈ పోటీ పరీక్షను ఆగస్టు 10 నుంచి 20 అర్ధరాత్రి వరకు నిర్వహించారు. కేవలం పది నిమిషాల్లో 20 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలనే నిబంధన విధించారు. అంతేకాదు, ఒక్కసారి పోటీ ప్రారంభమయ్యాక మధ్యలో ఆపడం కుదరదు. కంప్యూటర్‌ స్క్రీన్‌పై వచ్చిన ప్రశ్నకు వెంటనే సమాధానం ఇవ్వాలి. జవాబు తెలియకపోతే తర్వాత ప్రశ్న తెలుసుకునే అవకాశం కల్పించారు. ఈ విధానంలో వేగం, కచ్చితత్వంతో పాటు స్పందించే మనస్తత్వం ఉన్న విద్యార్థులు పోటీలో పాల్గొనగా, ప్రతీ రాష్ట్రం నుంచి ఇద్దరు ప్రతిభావంతులను ఎంపిక చేశారు. సరైన సమాధానాలు ఇచ్చినవారి సంఖ్య ఎక్కువగా ఉండగా, వారిలో అతి తక్కువ సమయంలో జవాబులు ఇచ్చిన విద్యార్థులను పరిగణనలోకి తీసుకున్నారు.