సమగ్ర పారిశుద్ధ్య ప్రణాళిక రూపొందించాలి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సమగ్ర పారిశుద్ధ్య ప్రణాళిక రూపొందించాలి

రాష్ట్ర ఐటి మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్
ఇంటింటి నుంచి తడి-పొడి చెత్త సేకరణపైన ప్రత్యేక దృష్టి చేపట్టాలి
హైద్రాబాద్,  అక్టోబర్ 15 (way2newstv.com)
 రాష్ట్రంలోని మున్సిపాలిటీలలో  మరింత సమర్థవంతంగా పారిశుధ్య నిర్వహణ జరిగేలా సమగ్ర ప్రణాళిక రూపొందించుకోవాలని రాష్ట్ర ఐటి మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు.  పారిశుద్ధ్య నిర్వహణ , నూతన మున్సిపాలిటీ చట్టం సంబంధిత అంశాలపై మంత్రి మంగళవారం పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అరవింద్ కుమార్ తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్ లతో దూరదృష్య సమీక్ష నిర్వహించారు.  ఈ సమీక్షలో పురపాలక శాఖ  మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ పల్లెల ప్రగతి కోసం ప్రభుత్వం నిర్వహించిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ విజయవంతమైందని, అదే స్ఫూర్తితో రాష్ట్రంలో ఉన్న పురపాలికల్లో మార్పు తీసుకుని వచ్చే విధంగా జిల్లా కలెక్టర్లు సమగ్ర ప్రణాళిక రూపొందించుకొని సిద్ధంగా ఉండాలని కేటీఆర్ ఆదేశించారు.  
సమగ్ర పారిశుద్ధ్య ప్రణాళిక రూపొందించాలి

ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 141 మున్సిపాలిటీలలో 42.6%  మేరే జనాభా నివసిస్తుందని, రాబోయే ఆరు సంవత్సరాలలో 50 శాతానికి పైగా జనాభా పట్టణాలలో నివసించే అవకాశం ఉందని, దానికి అనుగుణంగా అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ లకు మంత్రి కేటీఆర్ ఆదేశించారు.  సమగ్ర పారిశుధ్య నిర్వహణ ప్రణాళికలో భాగంగా తడి చెత్త పొడి చెత్త వేరు వేరుగా సేకరించడం, తరలింపు, ట్రీట్మెంట్ ప్లాంట్లు , కంపోస్ట్ పిట్లు, డంపింగ్ యార్డులు, పారిశుద్ధ్య కార్మికుల సంఖ్య, సిబ్బంది, అందుబాటులో ఉన్న పరికరాలు ,వాహనాలు సంబంధిత అన్ని అంశాలకు సంబంధించిన సమగ్ర నివేదికను జిల్లా కలెక్టర్లు తయారుచేసి వారం రోజులలో సమర్పించాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. జిల్లాలో ఉన్న ప్రతి పట్టణ ప్రాంతం పై కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ వహించాలని, పట్టణాల్లో జరిగే వాణిజ్య, వ్యాపార లావాదేవీలు కాంప్లెక్స్లు, భవన నిర్మాణ వ్యర్ధాల సేకరణకు సంబంధించి ప్రణాళిక రూపొందించుకోవాలని, పట్టణాలలో న పబ్లిక్ టాయిలెట్స్ పరిస్థితి  సమీక్షించుకోవాలని అవసరమైన మేర అదనంగా పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ప్రతి పట్టణంలో మహిళల కోసం ప్రత్యేకంగా షీ టాయిలెట్స్ నిర్మాణం చేయాలని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని పెట్రోల్ బంకులో రెస్టారెంట్లలో ని టాయిలెట్స్ ని ప్రజలు ఉపయోగించుకునే అవకాశం ఇవ్వాలని ఈ మేరకు వాటిని యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. దీంతోపాటు పట్టణంలో అందుబాటులో ఉన్న టాయిలెట్స్ సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు. రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీలో తప్పనిసరిగా డంపింగ్ యార్డ్, కాంపోస్ట్ పిట్టు, ఎఫ్.ఎస్.టి.పి లను ఏర్పాటు చేయాలని దీనికి అవసరమైన భూములను కలెక్టర్లు గుర్తించాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో 35 మున్సిపాలిటీలలో డంప్ యార్డులు, 59 మున్సిపాలిటీలలో కంపోస్ట్ పిట్లు, 67 మున్సిపాలిటీల్లో  పొడి చెత్త సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయుటకు అవసరమైన భూమిని సంబంధిత కలెక్టర్లు వెంటనే సేకరించాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో అక్రమ కట్టడాలకు తావులేకుండా పట్టణ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ఎల్ఆర్ఎస్ ప్రక్రియను పూర్తిచేయాలని,దీనికి సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసిందని దాని ప్రకారం దరఖాస్తులను స్వీకరించి ఎల్ఆర్ఎస్ ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్లు వీటిని పర్యవేక్షించాలని, భవిష్యత్తులో అక్రమకట్టడాల కు తావు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని మంత్రి కలెక్టర్లను ఆదేశించారు.  కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన స్వచ్ఛ సర్వేక్షన్ మార్గదర్శకాల ప్రకారం  పట్టణ ప్రాంతంలో ప్రతి 10000 మంది జనాభాకు 28 మంది పారిశుద్ధ్య కార్మికులను నియమించాలని, 500 గృహాలకు 1 స్వచ్ఛ ఆటో, 300 వాణిజ్య సముదాయాలకు మినీ లారీని ఏర్పాటు చేసుకోవాలని, దాని ప్రకారం జిల్లా కలెక్టర్లు పట్టణ ప్రాంతం లోని జనాభా లెక్కల ప్రకారం అవసరమైన మేర అదనంగా సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని, స్వచ్ఛ ఆటోలను, ఇతర వాహనాలను, పరికరాలను జిల్లా కలెక్టర్లు అందుబాటులో ఉన్న డిఎంఎప్టి నిధులు, ఇతర నిధులను ఉపయోగించుకొని కొనుగోలు చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 23 లక్షల 6 వేల 569 గృహాలకు అవసరమైన 4613 స్వచ్ఛ ఆటోలను కలెక్టర్లు వారం రోజులలో కొనుగోలు చేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. స్వచ్ ఆటో లో తడి చెత్త పొడి చెత్త వేరు చేయడానికి వీలుగా కంపార్ట్మెంట్ ఉండే విధంగా చూసుకోవాలని మంత్రి సూచించారు.  ప్రతి పట్టణానికి సంబంధించిన సమగ్ర పారిశుధ్య ప్రణాళికను సిద్ధం చేసి వారం రోజులలో కలెక్టర్లు సమర్పించాలని, అవుట్ సోర్సింగ్ ద్వారా వివిధ సంస్థల నుంచి విధులు నిర్వహిస్తున్న కార్మికులకు యూనిఫామ్, ఇతర పరికరాలు అందేలా చూడాలని, గ్రామపంచాయతీ లో పనిచేసే కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న విధంగా మున్సిపాలిటీలలో విధులు నిర్వహించే కార్మికులకు సైతం బీమా సౌకర్యం ప్రభుత్వం కల్పిస్తుందని, ఇందుకోసం కార్మికుల వివరాలను సేకరించాలని మంత్రి కలెక్టర్లకు ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం రెండు మున్సిపాలిటీలలో  సిరిసిల్ల మరియు వరంగల్ మాత్రమే మానవ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్ ఉందని, రాష్ట్రంలోని 141 మున్సిపాలిటీలలో 31 మార్చి 2020 వరకు మానవ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్ల నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించాలని ఆదిశగా కలెక్టర్ లు కృషి చేయాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలలో క్లస్టర్లను ఏర్పాటుచేసి చెత్త ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించుకోవాలని కలెక్టర్లకు మంత్రి ఆదేశించారు. ప్రతి మున్సిపాలిటీలలో హరిత ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని, 10 శాతం మున్సిపల్ బడ్జెట్ పచ్చదనం పెంపొందించడం కోసం ఖర్చు చేయాలని ఆ దిశగా కలెక్టర్లు పర్యవేక్షించాలని, నూతన మున్సిపల్ చట్టం పై మున్సిపల్ కమిషనర్లకు రెండు రోజుల ప్రత్యేక శిక్షణ అందించామని, త్వరలో మరో విడత కమిషనర్లకు టౌన్ ప్లానింగ్ సిబ్బందికి నూతన చట్టం పై అవగాహన కల్పిస్తామని మంత్రి తెలిపారు. నూతన మున్సిపాలిటీలలో ప్రతి ఇంటికి తడి చెత్త పొడి చెత్త వేరు వేరుగా సేకరించేందుకు అవసరమైన చెత్త బుట్టలను పంపిణీ చేయాలని, ఎల్ఈడి బల్బులను రిప్లైస్ చేయాలని మంత్రి సూచించారు. ప్రతి పట్టణంలో నర్సరీ ఏర్పాటు చేసుకోవాలన్నారు, ప్రతి పట్టణంలో లో మీ దశ పట్టణానికి సమీపంలో గ్రీన్ లంచ్ ఏర్పాటు చేసేందుకు గల అవకాశాలను పరిశీలించాలని అని, పట్టణాల్లో ఉన్న తాగునీటి వనరుల్లో మదింపు చేయాలని, నీటి సరఫరా నీటి వృధా ను నివారించేందుకు గల అవకాశాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. నూతన మున్సిపాలిటీలలో ఆదాయం పెంచుకునేందుకు గల అవకాశాలను కలెక్టర్లు పరిశీలించాలని, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే విధంగా వినూత్న ఆలోచనలతో జిల్లా కలెక్టర్లు విధులు నిర్వహించాలని మంత్రి సూచించారు