ఇక శివసేనకు దారే లేదా... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఇక శివసేనకు దారే లేదా...

ముంబై, నవంబర్ 6 (way2newstv.com)
మహారాష్ట్రలో సంక్షోభం మరింత ముదిరేలా ఉంది. ఈనెల 9వ తేదీతో శాసనసభ కాల పరిమితి ముగియనుంది. ఈలోగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావాలి. అయినా ఇప్పటి వరకూ ఆ దిశగా ప్రయత్నాలు జరగడం లేదు. భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్షనేత దేవేంద్ర ఫడ్నవిస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలసి వచ్చారు. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దం కావాలని అమిత్ షా చెప్పినట్లు తెలుస్తోంది. బలపరీక్ష సమయానికి అంతా సర్దుకుంటుందని అమిత్ షా చెప్పడంతో దేవేంద్ర ఫడ్నవిస్ వెనుదిరిగారు.మరోవైపు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో నేషనలిస్ట్ కాంగ్రెస్ నేత శరద్ పవార్ భేటీ అయ్యారు. మహరాష్ట్ర రాజకీయాలపై ఇరువురూ సుదీర్ఘంగా చర్చించారు. బీజేపీ మైండ్ గేమ్ లో పడిపోకూడదని సోనియా ఈ సందర్భంగా శరద్ పవార్ ను హెచ్చరించినట్లు తెలిసింది. 
ఇక శివసేనకు దారే లేదా...

బీజేపీ, శివసేనలు ఒక తాను ముక్కలేనని, ఇప్పుడు మద్దతిచ్చినా ప్రభుత్వాన్ని కొనసాగివ్వరని సోనియా గాంధీ అభిప్రాయపడినట్లు సమాచారం.దీంతో కాంగ్రెస్ పార్టీ శివసేనకు మద్దతిచ్చే అవకాశాలు సన్నగిల్లాయి. కాంగ్రెస్ మద్దతివ్వకుంటే ఎన్సీపీ కూడా పక్కకు వెళ్లే అవకాశముంది. దీంతో శివసేన ఒంటరిగా మారనుంది. ఇక విధిలేని పరిస్థితుల్లో బీజేపీ షరతులకు తలొగ్గుతుందా? పౌరుషానికి పోయి బీజేపీకి రాం రాం చెబుతుందా? అనేది చూడాల్సి ఉంది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారన్న వార్తలు వస్తున్నాయి.ఆయన ప్రమాణస్వీకారం చేసిన తర్వాత అమిత్ షా నేరుగా శివసేన అధినేత ఉద్దవ్ థాక్రేతో చర్చించే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ చర్చల్లో మంత్రి పదవులతో పాటు డీప్యూటీసీఎం ఇస్తామని, సీఎం పదవి ఇవ్వడం కష్టమని అమిత్ షా తేల్చేయనున్నారని చెబుతున్నారు. మరి శివసేన ఇందుకు అంగీకరిస్తుందా? డిప్యూటీతో సరిపెట్టుకుంటుందా? అంటే ఆ పార్టీ నేతలు మాత్రం కుదరదు పొమ్మంటున్నారు. మరి శివసేనకు వేరే ఆప్షన్ ఏముందన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. మొత్తం మీద మహారాష్ట్ర రాజకీయాలు మాత్రం ఇప్పట్లో తెగేలా లేవు.