టీజే వర్సెస్ ఎస్వీ మోహన్ రెడ్డి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

టీజే వర్సెస్ ఎస్వీ మోహన్ రెడ్డి

కర్నూలు, ఫిబ్రవరి 18, (way2newstv.com)
ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది.. పార్టీలు కూడా పూర్తిగా ఎన్నికలపై మూడ్‌లోకి వెళ్లిపోయాయి. నేతల వలసలు, గెలుపు వ్యూహాలు, గెలుపు గుర్రాలపై ఫోకస్ పెడుతున్నారు. సందంట్లో సడేమియా అన్నట్లు.. పార్టీల్లో టికెట్ల లొల్లి మొదలయ్యింది. టికెట్ మాదంటే.. మాదంటూ మాటల యుద్ధానికి దిగుతున్నారు. టీడీపీలో కర్నూలు సీటుపై లొల్లి మొదలయ్యింది. వైసీపీ నుంచి గెలిచి టీడీపీలో చేరిన ఎస్వీ మోహన్ రెడ్డి టికెట్‌పై ధీమాతో ఉంటే.. ఎన్నో ఏళ్లుగా అక్కడే పాతుకుపోయిన టీజీ కుటుంబం తామే బరిలోకి దిగుతామంటోంది. ఇలా పోటా-పోటీ ప్రకటనతో అధినేతకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నారు. 


టీజే వర్సెస్ ఎస్వీ మోహన్ రెడ్డి

ఎస్వీ మోహన్ రెడ్డి మంత్రి లోకేష్‌ను కర్నూలు నుంచి పోటీచేయాలని ఆహ్వానం పలికారు. కర్నూలు సీటును ఆయన కోసం త్యాగం చేస్తానని.. మరో చోట టిక్కెట్ అడగనని.. పార్టీ కోసం పనిచేస్తానని చెప్పుకొచ్చారు. మోహన్ రెడ్డి అక్కడితో ఆగలేదు.. మళ్లీ చిన్న తిరకాసు పెట్టేశారు. లోకేష్‌కు తప్ప.. వేరే ఎవరికి టిక్కెట్ ఇచ్చినా ఊరుకునేది లేదనేశారు. ఎస్వీ వ్యాఖ్యలకు ఎంపీ టీజీ వెంకటేష్ తనయుడు భరత్ కౌంటర్ ఇచ్చారు. మంత్రి నారా లోకేష్ కర్నూలు నుంచి పోటీ చేయాలని ఎస్వీ మోహన్ రెడ్డి ఇప్పుడు చెబుతున్నారు.. కానీ టీడీపీ అధినేత చంద్రబాబును కర్నూలు నుంచి పోటీ చేయాలని గత ఏడాదే కోరానని చెప్పుకొచ్చారు. ఆయన కర్నూలు నుంచి పోటీ చేస్తే జిల్లా మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. బాబు కర్నూలు నుంచి బరిలోకి దిగితే 75వేల మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు. జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో టీడీపీ విజయఢంకా మోగిస్తుందన్నారు. కర్నూలు నుంచి చంద్రబాబు, కుప్పం నుంచి లోకేష్ పోటీ చేయాలంటున్నారు భరత్. కర్నూలులో ముఖ్యమంత్రి పోటీ చేయని పక్షంలో.. గెలిచే వారికి టిక్కెట్ ఇవ్వాలన్నారు. తాజాగా మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎంపీ టీజీ వెంకటేష్ కాస్త ఘాటుగానే స్పందించారు. తెలుగుదేశం పార్టీ ఎస్వీ - టీజీ కుటుంబాల ఆస్తి కాదని.. ఓటర్ల ఆస్తి అన్నారు. మంత్రి లోకేష్ పోటీ చేస్తే పార్టీలో అందరూ మద్దతిస్తారని.. ఎస్వీ మోహన్ రెడ్డి ఒక్కరే సమర్థిస్తున్నానని చెప్పుకోవడం ఏంటన్నారు. ఎస్వీ మాయ మాటలతో ప్రజల్ని తికమకపెడుతున్నారని విమర్శించారు. గెలిచే అభ్యర్థికే చంద్రబాబు పట్టం కడతారనే విషయం మోహన్ రెడ్డి తెలుసుకోవాలని.. సర్వేల ప్రకారం టికెట్లు కేటాయించడం చంద్రబాబు ఆనవాయితీ అన్నారు.