విజయవాడ, ఫిబ్రవరి 18, (way2newstv.com)
ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో జంపింగ్ల గోల ఇప్పుడు బాగానే హీటెక్కిస్తోంది. సీట్ల లెక్కలు, గెలుపు అవకాశాలను బేరీజు వేసుకుంటున్న నేతలు ఏమాత్రం తమకు అనుకూలంగా పరిస్థితి లేకున్నా… అప్పటిదాకా కొనసాగిన పార్టీని వీడి వైరివర్గంలో చేరిపోతున్నారు. ఈ తరహాలో టీడీపీకి రాజీనామా చేసిన కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి, ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్లు వైసీపీలో చేరిపోయారు. వారి బాటలోనే విశాఖ జిల్లా అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ కూడా నడిచారు. ఈ చేరికలతో వైసీపీ బాగానే పొంగిపోయిందనే చెప్పాలి. ఎన్నికల వేళ అధికార పార్టీని వీడి ఏకంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు వస్తున్నారంటే… ఇక తమ గెలుపు ఖాయమేనని కూడా ఆ పార్టీ నేతలు భావించారు.
ఏపీలో జంపింగ్ జంపాంగ్ లు
అయితే ఈ చేరికలు జరిగిన ఓ వారం కూడా కాకముందే… వైసీపీకి చెందిన ఇద్దరు కీలక నేతలు ఆ పార్టీకి షాకివ్వబోతున్నారట. వీరిలో ఒకరు నెల్లూరు జిల్లా కావలి సీటును ఆశిస్తున్న సీనియర్ నేత విష్ణువర్ధన్ కాగా.. ఇంకొకరు నెల్లూరు జిల్లాకు చెందిన వేణుగోపాల్ రెడ్డి.వచ్చే ఎన్నికల్లో ఈ రెండు జిల్లాలను క్లీన్ స్వీప్ చేయడం ద్వారా మిగిలిన జిల్లాల్లో జరిగే నష్టాన్ని పూడ్చుకోవాలని జగన్ భావిస్తున్నారు. ఈ క్రమంలో ఈ రెండు జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించిన జగన్… మొన్న దగ్గుబాటి ఫ్యామిలీకి రెడ్ కార్పెట్ పరవగా, ఆ తర్వాత ఆమంచికి సాదర స్వాగతం పలికారు. అయినా ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డితో పాటు వేణుగోపాల్ రెడ్డి కూడా ఎందుకు వైసీపీని వీడుతున్నారన్న విషయానికి వస్తే… విష్ణువర్ధన్ రెడ్డి ఆది నుంచి వైఎస్ రాజశేఖరరెడ్డికి ముఖ్య అనుచరుడిగా ముద్రపడిపోయారు. వైఎస్ అకాల మరణం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన జగన్ వేరు కుంపటి పెట్టిన నేపథ్యంలో అప్పటిదాకా కాంగ్రెస్లోనే కొనసాగిన విష్ణు… వైసీపీలో చేరిపోయారు. అయితే గడచిన ఎన్నికల్లో చివరిదాకా తనను వెయిట్ చేయించిన జగన్… చివరి నిమిషంలో కావలి టికెట్ ను ప్రతాప్ కుమార్ రెడ్డికి ఇచ్చారు. పోనీ ఈ దఫా అయినా తనకు న్యాయం జరుగుతుందా? అని నాలుగున్నరేళ్ల పాటు చూసినా ఫలితం రాకపోవడంతోనే ఇప్పుడు ఆయన వైసీపీని వీడుతున్నట్లుగా సమాచారం.ఇక వేణుగోపాల్ రెడ్డి విషయానికి వస్తే.. తొలుత టీడీపీలోనే ఉన్న వేణుగోపాల్ రెడ్డి ఆ తర్వాత వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో సీటు ఖాయమని చెప్పడంతోనే ఆయన వైసీపీలో చేరగా.. ఎన్నికలు తరుముకువస్తున్నా కూడా జగన్ నుంచి క్లారిటీ లేదట. దీంతో విసుగెత్తిపోయిన వేణుగోపాల్ రెడ్డి ఇప్పుడు జగన్ కు ఝలక్కిచ్చి తిరిగి తన సొంత గూటికి వచ్చేందుకు సిద్ధమైపోయారట. మొత్తంగా ఇద్దరు ఎమ్మెల్యేలను వీడిన నేపథ్యంలో వైసీపీలో నెలకొన్న సంబరం… ఇప్పుడు ఇద్దరు కీలక నేతలు ఆ పార్టీని వీడుతుండటంతో రోజుల వ్యవధిలోనే ఆవిరి అయిపోతోందట.