విత్తుతో విపత్తు (శ్రీకాకుళం) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

విత్తుతో విపత్తు (శ్రీకాకుళం)

శ్రీకాకుళం, జూలై 24 (way2newstv.com): 
వ్యవసాయానికి సమయం చాలా ముఖ్యం. సాగుబడిలో ఏ మాత్రం జాప్యం జరిగిన ఏడాది పాటు నష్టపోవాల్సిందే. ప్రకృతి కరుణించకున్నా, నిర్లక్ష్యానికి గురైనా పంటకాలం తిరిగి రాదు. దీంతో అన్నదాతలు సాగు కాలం కోసం ఎదురుచూస్తారు. విత్తనాలు జల్లే సమయం కోసం అదును, పదును కోసం వేచి ఉంటారు. అదే ప్రక్రియలో మొలకలు రాకుంటే ప్రత్యామ్నాయం లేక రైతులు మానసిక క్షోభకు గురవుతారు. ప్రస్తుతం అదే జరిగింది. ఈ ఏడాది ప్రభుత్వం 1001 (విజేత) విత్తనాన్ని రద్దు చేసి దాని స్థానంలో ఎంటీయూ 1075 (పుష్యమి) రకాన్ని రైతులకు పరిచయం చేసింది. దీంతో జిల్లాలోని అత్యధికశాతం రైతులు ఆసక్తి చూపారు. రోజుల తరబడి వరుసలో నిలిచి విత్తనాలు దక్కించుకున్నా ప్రస్తుతం మొలకలు రాక లబోదిబో మంటున్నారు. దీనికి ప్రత్యామ్నాయం ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు.
విత్తుతో విపత్తు (శ్రీకాకుళం)

ఎంటీయూ 1075( పుష్యమి) రకం వరి విత్తనాలు దక్కించుకున్న రైతులు పొలాల్లో వెదల పద్ధతిలో జల్లారు. తీరా వర్షాలు కురిసి కర్షకుల్లో ఆనందం వ్యక్తం అవుతున్న తరుణంలో విత్తనాలు మొలకెత్తకపోవడం వారిని నిలువునా కుంగదీస్తోంది. పలు గ్రామాల్లో ఎంటీయూ 1075 (పుష్యమి) రకం విత్తనాలు మొలకలు రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నరసన్నపేట మండలంలోని పలు గ్రామాల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా కనిపిస్తోంది. త్వరలో వరి ఉబాలకు సిద్ధమవుతున్న తరుణంలో వరిమొలకలు రాకపోవడం గమనార్హం. భూమిలో నాటిని విత్తనాలు మచ్చుకు కూడా కానరాకపోవడంపై అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. నరసన్నపేట మండలం కోమర్తి, కొల్లవానిపేట, పసలవానిపేట, గుండివిల్లిపేట తదితర గ్రామాల్లో విత్తనాలు మొలకెత్తకపోవడం సమస్యాత్మకంగా మారింది.ఇప్పుడిప్పుడే ఈ సమస్య వెలుగు చూస్తున్న నేపథ్యంలో ఇతర మండలాల్లో కూడా ఈ విత్తనాల సమస్య జఠిలం కానుందని రైతులు భయపడుతున్నారు. ప్రస్తుత తరుణంలో ప్రత్యామ్నాయం లేక ఏం చేయాలో తెలియని పరిస్థితిలో అన్నదాతలు కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటికిప్పుడు విత్తనాలు వేసినా తీవ్ర జాప్యం జరుగుతుందని, తద్వారా కార్తెలు ముగిసి విత్తనాలు పుట్టవని భయపడుతున్నారు. పోనీ వరి ఆకులు కొందామన్నా అంతమేరకు ఆకులు అందుబాటులో లేవు. ఈ ఏడాదితో ప్రారంభించిన పుష్యమి సాగు కర్షకులకు కన్నీటిని మిగుల్చుతోంది. విత్తనాలు వేసి దాదాపు 20 రోజులు గడిచాయి. ఇతర రకాల విత్తనాలు మెరుగ్గా పైకి లేవగా, 1075 రకం విత్తనాలు వేసిన రైతుల్లో కొందరి పరిస్థితి మింగుడుపడడం లేదు. ఎందుకు ఈ రకం విత్తనాలు వేశామన్న బాధ వారిలో కనిపిస్తోంది.