ఇంప్లోజన్ విధానంలో కూల్చివేత - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఇంప్లోజన్ విధానంలో కూల్చివేత

15 సెకన్లలోకు రూ. 10 కోట్లు ఖర్చు
హైద్రాబాద్, ఆగస్టు 23 (way2newstv.com):
తెలంగాణ ప్రభుత్వం నూతన అసెంబ్లీ, సెక్రటేరియట్ భవనాల నిర్మాణానికి సంకల్పించిన సంగతి తెలిసిందే. ఎర్రమంజిల్ ప్యాలెస్ స్థానంలో అసెంబ్లీని నిర్మించి.. ప్రస్తుతం ఉన్న సెక్రటేరియట్ భవనాలను కూల్చివేసి, వాటి స్థానంలోనే నూతన సచివాలయాన్ని నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఆ దిశగా ప్రస్తుతం ఉన్న సెక్రటేరియట్ భవనాల కూల్చివేతకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఎర్రమంజిల్ ప్యాలెస్‌ను కూల్చివేతను ఆపాలని ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో కోర్టు కూడా ప్యాలెస్ కూల్చివేతపై స్టే విధించింది. అయితే సెక్రటేరియట్ భవనాన్ని మాత్రం వీలైనంత త్వరగా నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. 
ఇంప్లోజన్ విధానంలో కూల్చివేత

ఈ నేపథ్యంలోనే పాత సచివాలయాన్ని ఖాళీ చేసి, సమీపంలోని బీఆర్‌కే భవన్ నుంచి విధులు నిర్వహిస్తోంది. ప్రస్తుతం పూర్తిగా ఖాళీ అయిన సెక్రటేరియట్ భవనాలను కూల్చివేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞ‌ానాన్ని ఉపయోగించాలని భావిస్తోంది. కూలీలు, జేసీబీల ద్వారా కూల్చివేతకు చాలా సమయం పడుతుంది. బాంబులను వినియోగిస్తే.. పక్కన ఉన్న భవనాలకు నష్టం వాటిల్లుతుంది. దీంతో బిల్డింగ్ ఇంప్లోజన్ అనే ఆధునిక సాంకేతిక పద్ధతిలో సెక్రటేరియట్ భవనాలను కూల్చివేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విధానంలో భారీ భవనాలను కేవలం నిమిషంలో నాలుగో వంతులోనే నేలమట్టం చేయవచ్చు. ఈ విధానం ద్వారా సచివాలయానికి చుట్టుపక్కల ఉన్న భవనాలకు ఎలాంటి ప్రమాదం వాటిల్లదు. భవనం ఉన్న స్థలంలోనే క్షణాల్లోనే కుప్పకూలిపోతుంది. కానీ, భవనం కూలిన వెంటనే భారీ స్థాయిలో దుమ్మూ, ధూళి చెలరేగుతాయి. ఇంప్లోజన్ విధానంలో భవనాల కూల్చివేత ప్రక్రియ చాలా ఖర్చుతో కూడుకున్నది. సచివాలయ ప్రాంగణంలో 11 బ్లాక్స్‌ ఉన్నాయి. వీటిని ఇంప్లోజన్ విధానంలో 15 సెకన్లలోనే కూల్చివేయడానికి సుమారు రూ. 10 కోట్లు ఖర్చు అయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ విధానం అమలు చేయడానికి సాధ్యాసాధ్యాలను అధికారులు పరిశీలిస్తున్నారు. మొదట త్రీడి చిత్రీకరణ ద్వారా పరిశీలించి, ఆ తర్వాత అమలు చేయాలని భావిస్తున్నారు.