అన్నా, చెల్లెళ్ల ప్రేమకు ప్రతీక - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అన్నా, చెల్లెళ్ల ప్రేమకు ప్రతీక

ఉత్తరాది రాష్ట్రాల్లో ఘనంగా ఏర్పాట్లు 
రాజపుత్ర వనిత, చిత్తోర్‌గఢ్ రాణి కర్ణావతి అప్పటి ఢిల్లీ చక్రవర్తి హుమయూన్‌కు రాఖీని పంపి గుజరాత్ పాలకుడు బహదూర్ షా దండయాత్రలను నుంచి తమ రాజ్యాన్ని రక్షించాల్సిందిగా కోరారని, అప్పటి నుంచే రక్షా బంధన్ ప్రారంభమైందని అంటారు. అయితే ఈ సంప్రదాయం కొన్న వేల ఏళ్ల కిందటే ఉన్నట్లు హిందూ పురాణాల్లో పేర్కొన్నారు. ముఖ్యంగా వేదకాలంలో దీనికి విశేష ప్రాచుర్యం లభించింది. వేదకాలంలో ఈ పండుగను కేవలం సోదరి, సోదరుల బంధంగానే కాదు, భార్యాభర్తలకు సంబంధించింది కూడా అని పేర్కొన్నారు. దీనికి సంబంధించి పురాణంలో ఓ కథ ఉంది. రాక్షసులతో యుద్ధానికి బయలుదేరిన దేవలోకాధిపతి ఇంద్రుడికి భార్య సచీదేవి రక్షణగా రాఖీ కట్టింది. 
అన్నా, చెల్లెళ్ల ప్రేమకు ప్రతీక
అయితే ప్రస్తుతం ఇది భార్యభర్తల నుంచి వైదొలగి కేవలం సోదరి-సోదరుల బంధానికి ప్రతీకగా జరుపుకునే ఉత్సవంగా మారిపోయింది. అలాగే యమధర్మరాజు సోదరి యుమన ప్రతి శ్రావణ పౌర్ణిమకు యుముడికి రాఖీ కట్టేది. తన సోదరితో ఎవరైతో రాఖీ కట్టించుకుంటారో వారికి అమరత్వం సిద్ధిస్తుందని యుముడు ప్రకటించాడు. అప్పటి నుంచి మహిళలు తమ సోదరులకు రాఖీ కట్టి చిరాయువుగా జీవించాలని కోరుకుంటారు. అలాగే సోదరులు కూడా తమ సోదరికి అశీసులు అందించి ప్రేమను చాటుకుంటారు. వాస్తవానికి పసుపులో దారాన్ని ముంచి, దాన్ని మూడు పొరలుగా చేతికి కట్టిన రాఖీ రక్షణగా ఉంటుంది. రాణి కర్ణావతి హుమయూన్‌కు రాఖీ పంపిన రోజు శ్రావణ పూర్ణిమ 
కావడంతో మేవార్‌లో రక్షా బంధన్ తొలిసారిగా ప్రారంభమై, తర్వాత రాజస్థాన్ అంతటా వ్యాపించింది. అక్కడ నుంచి దేశమంతటా జరుపుకుంటున్నారు. వేడుకల పరంగా రక్షాబంధన్ కాలంతోపాటు మారుతూ వస్తుంది. రాఖీని సోదరి తన సోదరుడు కుడిచేతికి కట్టాలి. రాఖీలో దారం బంధానికి చిహ్నం. అలాగే మంచి చెడులు, వైఫల్యాల నుంచి సోదరుని ఇది కాపాడుతుంది. ఎరుపు రంగు దారం అగ్నికి ప్రతీక... అంటే ఇది శక్తికి, రక్షణకు, భద్రతకు బలం. ఒడిశాలో రాఖీ పండుగను 'గ్రహ్మ పూర్ణిమ' అని పిలుస్తారు. ఆ రోజున వారు దైవాల్లా భావించే ఆవులు, ఎద్దులకు శుభ్రంగా స్నానం చేయించి, అలంకరిస్తారు. 'పితా' అని పిలిచే మిఠాయిలు చేసి ఇరుగుపొరుగుకి పంచుతారు. మహారాష్ట్ర, గుజరాత్‌, గోవాలలో ఈ రోజును 'నారియల్‌ పూర్ణిమ' అంటారు. బాగా వర్షాలు సమృద్ధిగా కురవాలని వరుణుడు, సముద్రుణ్ని పూజిస్తారు. జాలరులు ఈ రోజు నుంచే చేపలు పట్టే కాలం ప్రారంభమైనట్టు భావిస్తారు. ఉత్తరాఖండ్‌లోని ప్రజలు 'జనోపున్యు' పేరుతో రాఖీ పండుగను చేసుకుంటారు. తమ పవిత్రమైన జంధ్యాన్ని మారుస్తారు. చంపావత్‌ అనే జిల్లాలో బగ్వాల్‌ పేరుతో పెద్ద ఉత్సవాన్ని నిర్వహిస్తారు. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గడ్‌, జార్ఖండ్‌, బీహార్‌లలో 'కజరి పూర్ణిమ' అని పిలుస్తారు. ఇది రైతులకి, కొడుకులున్న తల్లులకి చాలా ముఖ్యమైన పండగ. గుజరాత్‌లో కొన్ని ప్రాంతాల్లో 'పవిత్రోపన' పేరుతో పండుగను నిర్వహిస్తారు. ఈ రోజున శివుని గురించి ప్రజలందరూ పూజ చేస్తారు.