కన్నడ ఎన్నికలపై మఠాఠ ప్రభావం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కన్నడ ఎన్నికలపై మఠాఠ ప్రభావం

బెంగళూర్, నవంబర్ 20 (way2newstv.com)
మహారాష్ట్ర ప్రభావం కర్ణాటక ఉప ఎన్నికలపై పడేటట్లు ఉంది. ఈ విషయం కాంగ్రెస్ నేతల్లో ఆందోళన కల్గిస్తోంది. మహారాష్ట్రలో శివసేనతో పొత్తు పెట్టుకుంటే కన్నడ నాట కాంగ్రెస్ కు చుక్కెదురు కాక తప్పదని భావిస్తున్నారు. కర్ణాటకలో వచ్చే నెల 5వ తేదీన 15 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి, ఈ నియోజకవర్గాలన్నీ దాదాపు కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలే కావడంతో కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలను తీసుకుంది.మొత్తం పదిహేను నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించి ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్దమయింది. అయితే మహారాష్ట్ర పరిణామాలు తమ రాష్ట్రంపై పడతాయన్న ఆందోళన కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతోంది. 
కన్నడ ఎన్నికలపై మఠాఠ ప్రభావం

హిందుత్వ పార్టీ అయిన శివసేనతో పొత్తుకు కాంగ్రెస్ ప్రయత్నించడంతో ఇక్కడ కొన్ని సామాజిక వర్గాలు తమకు దూరమవుతాయన్న ఆందోళన కాంగ్రెస్ నేతల్లో నెలకొని ఉంది. ఇక్కడ నైతికత ప్రధానాంశంగా ఇటు జేడీఎస్, అటు బీజేపీలు కాంగ్రెస్ పై దుమ్మెత్తి పోస్తున్నాయి.మరోవైపు ఇప్పటికే మొన్నటి వరకూ మిత్రపక్షంగా ఉన్న జనతాదళ్ ఎస్ కాంగ్రెస్ తో తెగదెంపులు చేసుకుంది. ఇప్పుడు దానికి ఒక కారణం దొరికింది. కాంగ్రెస్ అనైతికంగా మహారాష్ట్రలో శివసేన తో పొత్తు పెట్టుకుని ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నించడం పట్ల మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తీవ్రంగా తప్పుపట్టారు. కాంగ్రెస్ ను కర్ణాటక ప్రజలు నమ్మే రోజులు పోయాయని కుమారస్వామి తీవ్ర వ్యాఖ్యలు చేయడం గమనార్హం.ఇక కాంగ్రెస్ సీనియర్ నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ లు కూడా మహారాష్ట్ర ఎఫెక్ట్ ఇక్కడ పడే అవకాశముందని కాంగ్రెస్ హైకమాండ్ కు చేరవేశారు. అందుకే సోనియా గాంధీ శివసేన తో ప్రభుత్వం ఏర్పాటు చేసే అంశాన్ని కొద్దికాలం పాటు వాయిదా వేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు కర్ణాటక ఉప ఎన్నికలు పూర్తయిన తర్వాత దీనిపై ఆలోచించవచ్చని సోనియాగాంధీ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇదే విషయాన్ని శరద్ పవార్ చేత ఇంకా చర్చలు జరగలేదని చెప్పించినట్లు సమాచారం. మొత్తం మీద కర్ణాటక, జార్ఖండ్ ఎన్నికలే మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుకు అడ్డంకిగా మారాయన్న టాక్ నడుస్తోంది.