దారి మళ్లుతున్న రాజన్న నిధులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

దారి మళ్లుతున్న రాజన్న నిధులు

కరీంనగర్, నవంబర్ 12, (way2newstv.com)
దశాబ్దాలు గడుస్తున్నా  వేములవాడ క్షేత్ర రూపురేఖలు మారడం లేదు. తెలంగాణ ఏర్పడితే తప్ప ఈ ఆలయం దశ తిరగదని అంతా భావించారు. అనుకున్నట్లే ప్రత్యేక  రాష్ట్రం వచ్చింది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి కేసీఆర్సీఎం అయ్యారు. 2015 జూన్18న ముఖ్యమంత్రి హోదాలో  వేములవాడ దేవస్థానాన్ని సందర్శించారు. తనకు రాజన్న అంటే ఇష్టదైవమని చెప్పుకున్న కేసీఆర్, ఏటా బడ్జెట్లో రూ.100 కోట్లను వేములవాడకు కేటాయించి, క్షేత్రాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. సాక్షిగా 2015 జూన్ 18న సీఎం కేసీఆర్ఇచ్చిన హామీ అమలుకు నోచుకోవడం లేదు నాలుగేండ్లలో రూ.400 కోట్లు కాదుకదా, కనీసం వంద కోట్లయినా ఇవ్వలె. పైగా ఏటా రూ.90 కోట్లకు పైగా వచ్చే రాజన్న ఆదాయాన్ని ఉల్టా ప్రభుత్వమే తన ఖజానాకు మళ్లించుకుంటున్నది. 
దారి మళ్లుతున్న రాజన్న నిధులు

రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటికి కేవలం రూ. 71.50 కోట్లు మాత్రమే ఇచ్చినరు. వాటితో ఏ ఒక్క పనీ పూర్తికాలే. ఫలితంగా ఎములాడ పదేండ్ల కింద ఎట్లున్నదో గిప్పుడు గట్లనే ఉన్నది.  గవే ఇరుకు రోడ్లు.. గవే ఇరుకు క్యూలైన్లు ఎక్కిరిస్తన్నయ్. సరిపడా వసతి గదులు లేక భక్తులు మెట్ల మీదే పడుకుంటున్నరు. నాలుగు నెలలుగా పూర్తిస్థాయి ఈవో కూడా లేరు. మూడు నెలల్లో సమ్మక్క జాతర మొదలైతే కోటికి పైగా భక్తులు వచ్చే అవకాశమున్నా విస్తరణ పనులు ముందుకు సాగుతలేవు.సీఎం హామీల సంగతెలా ఉన్నా అధికారులు ఉన్న గుడిచెరువును పూర్తిగా పూడ్చివేశారు. దీని విస్తీర్ణం169 ఎకరాలు కాగా మరో 35 ఎకరాల స్థలాన్ని  ప్రైవేట్ వ్యక్తుల నుంచి కొనుగోలు చేసి  క్రీడా మైదానంలా మార్చేశారు. అధికారులు తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయంతో పట్టణంలో వేసవి కాలంలో తాగునీటి ఇబ్బందులు ఎదురయ్యాయి.  సేకరించిన 35 ఎకరాల్లో శివ కల్యాణ మండపం, రామ కల్యాణ మండపం, కల్యాణ కట్ట, వేద, నృత్య పాఠశాల, చెరువు నడుమ  నటరాజ విగ్రహం, అన్నదాన భవనం, ప్రసాదం కౌంటర్స్ ఏర్పాటు చేస్తామని చెప్పినా నిధుల్లేక ఏ నిర్మాణమూ చేపట్టలేదు.ప్రధానంగా ఆలయానికి వచ్చే  రోడ్ల విస్తరణ చేపడతామని, ఆలయ ప్రాంగణాన్ని మరింత విస్తరించి, క్యూలైన్లను వెడల్పు చేస్తామన్నారు. భక్తుల సంఖ్యకు సరిపడా మరిన్ని వసతి గృహాలు నిర్మిస్తామని, విశాలమైన పార్కింగ్స్థలం ఏర్పాటు చేస్తామని, గుడిచెరువు చుట్టూ150 ఫీట్ల వెడల్పుతో 3.5 కి.మీ. మేర ట్యాంక్ బండ్ నిర్మిస్తామని ప్రకటించారు. మధ్యలో పిల్లలు, పెద్దలు సేదదీరేందుకు పార్కులు, పెద్ద శివుని విగ్రహం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు రంగురంగుల బ్రోచర్లను అధికారులు విడుదల చేశారు.వేములవాడ దేవస్థానానికి నాలుగు నెలలుగా ఈవో లేరు. దేవాదాయ శాఖలో విజిలెన్స్జాయింట్కమిషనర్ గా చేస్తున్న కృష్ణవేణికి జులై 5 న ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ఆమె నాలుగు నెలలుగా వారంలో 3 రోజులు వేములవాడలో, మరో మూడు రోజులు హైదరాబాద్లో విధులు నిర్వహిస్తున్నారు. మరో మూడు నెలల్లో సమక్క జాతర మొదలవుతుంది. సమ్మక్క జాతరకు వెళ్లే భక్తులంతా అంతకుముందు విధిగా రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీ. ఇప్పటికే ప్రతిరోజూ సుమారు 30 వేల మంది, శుక్ర, ఆది, సోమవారాల్లో  50 వేల మందికి పైగా భక్తులు వస్తున్నారు. సమ్మక్క జాతరకు ముందు డిసెంబర్ నుంచి ప్రతిరోజూ లక్ష దాటుతారు. అందువల్ల రోడ్లు, క్యూలైన్ల విస్తరణ, ఇతర  మౌలిక వసతులను కల్పించే పనులకు వెంటనే ప్రతిపాదనలు తయారుచేసి, ప్రభుత్వ ఆమోదం పొందాలి. పూర్తిస్థాయి ఈవో ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. సర్కారు వెంటనే స్పందించి, ఈవోను నియమించడంతో పాటు సమ్మక్క జాతరలోగా కొన్ని పనులనైనా చేపట్టాల్సిన అవసరం ఉంది.