దగ్గుబాటిని వెంటాడుతున్నదురదృష్టం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

దగ్గుబాటిని వెంటాడుతున్నదురదృష్టం

ఒంగోలు, అక్టోబరు 30, (way2newstv.com)
డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వర రావు… ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ తరువాత ఆయన చెప్పిందే వేదం. రామారావు పెద్దల్లుడిగా పార్టీలో అన్ని తానై ఒక వర్గాన్నే ఆయన మెయింటైన్ చేసేవారు. ఇదంతా చంద్రబాబు టిడిపి లో చేరి గ్రూప్ కట్టేంత వరకే సాగింది. బాబు చాపకింద నీరులా తన సొంత వర్గాన్ని తయారు చేసుకోవడం మొదలు పెట్టి మొత్తం విస్తరించే వరకు అటు ఎన్టీఆర్ కానీ దగ్గుబాటి వెంకటేశ్వర రావు కానీ రాబోయే ప్రమాదాన్ని శంకించలేదు. తానే పార్టీ గా భావించిన ఎన్టీఆర్ తనకే వెన్నుపోటు ఎదురౌతుందని ఏనాడు కలలో కూడా ఊహించలేదు. ఇక పెద్దల్లుడు – చిన్నల్లుడు తన పిల్లలతో కలిసి పార్టీనే తననుంచి దూరం చేస్తారని అస్సలే అనుకోలేదు. 
దగ్గుబాటిని వెంటాడుతున్నదురదృష్టం

ఆ స్థాయిలో చంద్రబాబు ఎన్టీఆర్ వెనుకే వ్యవహారం నడిపారు.నాడు చంద్రబాబు తో చేతులు కలపను గాక కలపను అన్న దగ్గుబాటి వెంకటేశ్వర రావు కి డిప్యూటీ ముఖ్యమంత్రి పదవిని చంద్రబాబు ఆఫర్ చేసి పని పూర్తి అయ్యాక పక్కన పెట్టేశారు.సహజంగానే సున్నిత మనస్కుడైన దగ్గుబాటి వెంకటేశ్వర రావు మౌనంగా తరువాతి రాజకీయాల్లో ఉండిపోయారు. అప్పటినుంచి రగిలిపోయినా, చంద్రబాబు తో కలవడం చారిత్రక తప్పిదమే అని పలు ఇంటర్వ్యూల్లో దగ్గుబాటి వెంకటేశ్వర రావు అంగీకరించినా ఆయనకు వ్యక్తిగతంగా జరగాలిసిన నష్టం జరిగిపోయింది. ఇక ఆ తరువాత భార్య పురంధరేశ్వరి కాంగ్రెస్ లోకి వెళ్ళడం కేంద్రమంత్రిగా వెలుగు వెలగడంతో దగ్గుబాటి వెంకటేశ్వర రావు ప్రేక్షకపాత్రనే రాజకీయాల్లో వహించారుఆ తరువాత 2019 ఎన్నికలకు రెండేళ్లు ఉండగా దగ్గుబాటి వెంకటేశ్వర రావు కొద్ది కొద్దిగా యాక్టివ్ అయ్యారు. ఉండవల్లి తో కలిసి పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శించి బాబు ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించి తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నట్లు సంకేతాలు ఇచ్చేశారు. ఆ తరువాత ఒక ఫైన్ డే తన కుమారుడు హితేష్ ను తీసుకుని జగన్ సమక్షంలో అధికారికంగా తీర్ధం పుచ్చుకుని దగ్గుబాటి వెంకటేశ్వర రావు సంచలనానికి తెరతీశారు. కుమారుడికి ద్వంద పౌరసత్వం కారణంగా పర్చూరు నుంచి ఆయనే పోటీ చేయాలిసి వచ్చింది. చివరినిమిషంలో పార్టీలో చేరడంతో సొంతపార్టీలో ఆ స్థానం ఆశించినవారు, ప్రత్యర్థి టిడిపి వ్యూహాలు పనిచేయడంతో దగ్గుబాటి వెంకటేశ్వర రావు ఓటమి పాలయ్యారు.గెలిస్తే జగన్ దగ్గుబాటి వెంకటేశ్వర రావును స్పీకర్ గా కుర్చోపెట్టేవారని ఎన్నికల ముందు నుంచి గట్టి ప్రచారమే సాగింది. దురదృష్టం మరోసారి దగ్గుబాటి వెంకటేశ్వర రావుని వెక్కిరించింది. ఇటీవల ఉంటే కుటుంబం అంతా ఒకే పార్టీలో వుండాలంటూ జగన్ చేసిన సూచన, గత ఎన్నికల్లో తన ఓటమికి కారణమైన వారిని తిరిగి పార్టీలో చేర్చుకోవడం ద్వారా రాజకీయ సన్యాసం మరోసారి తనకు తానుగానే దగ్గుబాటి వెంకటేశ్వర రావు చేసుకునేలా వైసిపి పావులు కదిపింది. అనుకున్నట్లే దగ్గుబాటి వెంకటేశ్వర రావు వైసిపి కి గుడ్ బై కొట్టేశారు. ఇకపై తన భార్య కు వెనుకుండి అండదండలు అందించేందుకు ప్రత్యక్ష రాజకీయాలకు దూరం గా ఉండేందుకు ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగిపోయింది. అది ఏ మేరకు వారి కుటుంబానికి కలిసి వస్తుందో చూడాలి.